ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అదిరిపోయిన వార్త ఒకటి బయటకు వచ్చింది. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నోటి ద్వారా బయటపడింది. పైగా ఆయన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దగ్గర వ్యక్తిగా ప్రాచుర్యం ఉంది. అందుకే ఆయన చెప్పిన మాటకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల కలిసిపోతారని సదరు నేత చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ప్రచారం గా మారింది. అదే జరిగితే నిజంగా అదో సంచలన వార్తగా మిగలనంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకున్నారు షర్మిల. ఆమె కోరుకున్న మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరమయ్యారు. అయితే షర్మిలకు ఇందులో ప్రత్యేకంగా వచ్చిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆమె ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పతనం అవుతోంది. అయితే వీరిద్దరి పరిస్థితి గమనించిన రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు వీరిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
* వసుదైక కుటుంబం..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) బతికున్నంత కాలం ఆ కుటుంబం ఉమ్మడిగానే కొనసాగింది. 2019 ఎన్నికల వరకు ఏకతాటిపైకి నిలిచింది. అయితే వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చింది. ఆపై జగన్మోహన్ రెడ్డితో తలెత్తిన విభేదాలతో షర్మిల సోదరుడికి దూరమయ్యారు. అప్పటినుంచి ఆ కుటుంబంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి మారింది. ఇది ఎంత మాత్రం రాజశేఖరరెడ్డి కుటుంబ అభిమానులకు మింగుడు పడడం లేదు. అయితే మెజారిటీ కుటుంబాభిమానులు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. కానీ అంతకుమించి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పును ఎక్కువ మంది ఎత్తిచూపారు. దాని ప్రభావమే 2024 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు.
*:అన్న పతనం కోరిన చెల్లెలు..
వైయస్ షర్మిల( Y S Sharmila ) జగన్మోహన్ రెడ్డిని ఎంతగా పతనం చేశారు అంతలా చేశారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం సోదరుడు జగన్మోహన్ రెడ్డి పట్ల అత్యంత ప్రేమగా మెలిగే వారు షర్మిల. అదే స్థాయిలో ప్రేమను చూపారు జగన్మోహన్ రెడ్డి. చివరకు తండ్రి అకాల మరణంతో వంటరైన సోదరుడికి అండగా నిలిచారు షర్మిల. కానీ ఆమె కోరుకున్నట్లు ఆస్తుల పంపకాలు జరగకపోవడం, కుటుంబంలో గౌరవం దక్కకపోవడంతో సోదరుడిని విభేదించడం ప్రారంభించారు షర్మిల. అలా వారిద్దరి మధ్య ప్రారంభమైన వివాదం రాజకీయంగా విభేదించే దాకా పరిస్థితి వచ్చింది. షర్మిల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి ని పతనం దిశగా తీసుకెళ్లాయి. ప్రత్యర్థులను లాభం చేకూర్చాయి.
* కలిపిన కుటుంబ అభిమానులు
2024 ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదించారు షర్మిల. అయితే ఇది ఎంత మాత్రం కుటుంబ అభిమానులకు రుచించలేదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనం అయ్యారు. అలాగని షర్మిల మెరుగు పడలేదు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ కుటుంబాలు అన్నా చెల్లెలు ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు తగ్గించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానుకున్నారు. అన్నింటికీ మించి ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని టార్గెట్ చేసుకుంటున్నారు.
* బయటపెట్టిన కీలక నేత..
అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయిన సతీష్ రెడ్డి ( Satish Reddy )ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. సుదీర్ఘకాలం టిడిపిలో ఉండి రాజశేఖర్ రెడ్డి కుటుంబ వ్యతిరేకంగా ముద్రపడ్డారు సతీష్ రెడ్డి. కానీ ఆయన రాజశేఖర్ రెడ్డి కి సమీప బంధువు అని… రాజశేఖర్ రెడ్డి కుటుంబం రాజకీయంగా బలపడడంలో ఆయన పాత్ర ఉందని.. తెలుగుదేశం పార్టీలో ఉంటూనే రాజశేఖర్ రెడ్డి కుటుంబం కోసం పనిచేశారనే విమర్శ ఆయనపై ఉంది. 2024 ఎన్నికలకు ముందు సతీష్ రెడ్డి జగన్ పిలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటువంటి నేత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో జగన్మోహన్ రెడ్డితో షర్మిల కలిసి పోవడం ఖాయం అని తేల్చి చెప్పారు. తద్వారా అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి పోతారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ చర్చలు ఎంత నిజం ఉందో చూడాలి.



