భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ ను ప్రకటించింది. బిజెపి కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. పార్లమెంటరీ బోర్డు సైతం ఆమోదం తెలిపినట్టు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రత్యేక ప్రకటన చేశారు. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈ కీలక నిర్ణయం వెలువడింది. జేపీ నడ్డా విషయంలో సైతం ఇదే జరిగింది. ముందుగా ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తరువాత జాతీయ అధ్యక్షుడిని చేశారు.
భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ప్రతి నిర్ణయం వెనుక భవిష్యత్తు రాజకీయం దాగుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ విషయంలో ఎస్సీలు వ్యతిరేకంగా ఉండేవారు. ఎస్టి ఆదరణ కూడా ఆ పార్టీకి తక్కువ. ఆ ముద్ర చెరిపేందుకు అనేక రకాలుగా ప్రయత్నించింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము( Draupadi murm ) నియామకం వెనుక ఉన్న రహస్యం అదే. ఒడిస్సా కు చెందిన ద్రౌపది ముర్ము ఎస్టి సామాజిక వర్గానికి చెందినవారు. దేశ అత్యున్నత పదవిలో ఆమెను కూర్చోబెట్టి ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించగలిగింది భారతీయ జనతా పార్టీ.
అయితే సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో ఉండాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక సమయంలో సైతం అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. సాధారణంగా బిజెపిలో ముఖ్యమంత్రి పదవికి ముందే పేరు ప్రకటించారు. పార్టీ గెలిచిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. హై కమాండ్ ఎంపిక చేస్తోంది. అయితే అన్ని రకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్( Yogi Adityanath) లాంటి నేత ఎంపిక అందులో భాగమే. ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో సైతం సామాజిక సమీకరణలను పెద్దపీట వేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ.
2029 సార్వత్రిక ఎన్నికల్లో సైతం బిజెపి మరోసారి విజయం సాధించేందుకు వీలుగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా బీహార్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ కు( Nitin Navin ) వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణ శాఖ బాధ్యతలను చూస్తున్నారు. సీనియర్ నేత.. వరుసగా నాలుగు సార్లు గెలిచారు. అందుకే ఆయన సీనియారిటీని, సిన్సియారిటీని గుర్తించి హైకమాండ్ ఈ పదవిలో కూర్చోబెట్టింది. 2020లో జాతీయ అధ్యక్షుడయ్యారు జేపీ నడ్డా. తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. తరువాత ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి నితిన్ నబీన్ కు దక్కనుంది.
నితిన్ నబీన్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. దివంగత బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు ఈయన. తండ్రి మరణం తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్రంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
పని చేసుకుంటూ పోవడమే
చత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ఇన్చార్జిగా నితిన్ నబీన్ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ప్రభుత్వంలో పని చేసిన అనుభవంతో పాటు సంస్థాగతంగాను నితిన్ నబీన్ కు విస్తృతమైన అనుభవం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బిజెపి పార్లమెంటరీ కమిటీ నితిన్ నబీన్ కు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నేరుగా ఆయన జాతీయ పగ్గాలు చేపట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.



