“నరేంద్ర మోడీ ( Narendra Modi)తర్వాత చంద్రబాబు ప్రధాని కానున్నారు. ఆయన కాకుంటే కుమారుడు లోకేష్ కు అవకాశం కల్పించనున్నారు”.. మీరు వింటున్నది నిజమే. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. కొద్ది రోజుల్లో 2025 ఏడాది కనుమరుగు కానున్న నేపథ్యంలో.. భవిష్యత్తు రాజకీయాలను అంచనా వేస్తూ వార్తా సంస్థలు కథనాలు ప్రచురిస్తుంటాయి. భవిష్యత్తు రాజకీయాలపై సరికొత్తగా విశ్లేషణలు చేస్తుంటాయి. అందులో భాగంగా రాయిటర్స్ సంస్థ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. జాతీయస్థాయిలో ఇప్పుడు ఇదే చర్చకు దారితీసింది.
2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ( Bhartiya Janata Party )నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి ఈ దేశానికి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. అయితే బిజెపి సొంతంగా అధికారంలోకి రావాలని భావించింది. కానీ మెజారిటీకి కూత వేటు దూరంలో నిలిచిపోయింది బిజెపి బలం. ఇటువంటి సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీతో పాటు జెడియు మద్దతుతో ప్రధాని నరేంద్ర మోడీ అధికారాన్ని చేపట్టారు. అయితే 2029 ఎన్నికల నాటికి మోడీ వయస్సు 79 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఆయన స్వచ్ఛందంగా ప్రధాని పదవి నుంచి పక్కకు తప్పుకుంటారు అన్నది ఈ కథనం సారాంశం.
ఒకవేళ బిజెపి నరేంద్ర మోడీ తర్వాత బిజెపి నేతలు మాత్రమే పదవి చేపట్టాలంటే ఇద్దరు పేర్లను ఈ కథనం బయట పెట్టింది. అందరూ అనుకున్నట్టు మాదిరిగా నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా( Amit Shah ) ఈ దేశానికి ప్రధాని అవుతారని పేర్కొంది. ఆ ఇద్దరు తరువాత ఎవరు అంటే మాత్రం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రస్తావించింది. అయితే ఇప్పటికే మోదీ తర్వాత బిజెపిలో పవర్ ఫుల్ నాయకుడిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. కానీ ఆయన పేరును ఈ కథనంలో పరిగణలోకి తీసుకోలేదు.
ఒకవేళ బిజెపి మిత్రపక్షానికి అవకాశం ఇస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు( Chandrababu Naidu) ఛాన్స్ దక్కుతుందని రాయిటర్స్ కథనం చెబుతోంది. ఒకవేళ ఆయన కాకుంటే ఆయన కుమారుడు లోకేష్ కు ఛాన్స్ దక్కుతుందని కూడా పేర్కొంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు అవకాశం దక్కుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయింది. 25 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. బిజెపి కాకుంటే చంద్రబాబు వరకు అది వస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే చంద్రబాబు కేంద్ర రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యమిస్తారు. పైగా గతం మాదిరిగా సంకీర్ణ ప్రభుత్వాలు చిన్న పార్టీలతో సాధ్యమయ్యే పని కాదు. అయితే రాయిటర్స్ సంస్థకు మంచి ప్రజాదరణ ఉంది. మరి ఆ కథనం ఎందుకు ఇచ్చారో.. అందులో చంద్రబాబు పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియడం లేదు.
ఒకటి మాత్రం నిజం గతం కంటే కేంద్రంలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పాత్ర పెరిగింది. బిజెపికి నమ్మదగిన మిత్రుడిగా టిడిపి మారింది. చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు తరచూ నేషనల్ మీడియాలో వినిపిస్తోంది. మూడోసారి మోడీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణం కావడంతో కేంద్ర పెద్దలు సైతం ఆయనను ఎనలేని గౌరవం ఇస్తున్నారు. బహుశా అందుకే అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ కథనం ప్రచురించి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరి తెర వెనుక ఏం జరిగింది అనేది వారికే తెలియాలి.



