రాజకీయాలకు పనికిరాడు. ఆయనతో వేస్ట్. ఎంత మాత్రం సమర్ధుడు కాదు. ఆయనకు ప్రసంగం రాదు. ప్రసంగించే తీరు రాదు. పార్టీని నడిపించ లేరు. అధికారంలోకి తీసుకురాలేరు.. ఇవి నారా లోకేష్( Nara Lokesh) విషయంలో వినిపించిన మాటలు. కానీ అదే లోకేష్ ఈరోజు పరిణితి చెందిన నాయకుడు. రాజకీయాల్లోనే కాదు పాలనలోను తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తెలుగు వాళ్ళు మెచ్చుకునేలా తనను తాను తీర్చిదిద్దుకున్నారు నారా లోకేష్. విమర్శించిన నోళ్ళతోనే శభాష్ అనిపించుకుంటున్నారు. విమర్శించిన వారితోనే అభినందనలు అందుకుంటున్నారు.
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో( Indian political history) ఏపీ సీఎం చంద్రబాబు ది ప్రత్యేక స్థానం. ఆయన కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చారు లోకేష్. అయితే బలవంతంగా ప్రవేశపెట్టబడ్డారన్నది లోకేష్ పై ఉన్న అభియోగం. బహుశా ఆ ఆలోచనతోనే ప్రత్యర్ధులు ఆయనపై విరుచుకుపడేవారు. వ్యక్తిత్వ హననానికి దిగేవారు. దేశంలో ఏ రాజకీయ వారసుడుపై లేని దుష్ప్రచారం లోకేష్ పై జరిగింది. ఒకానొక దశలో సొంత పార్టీ వారే ఆయన విషయంలో చాలా హేళనగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ దాటుకుంటూ పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ ఎదిగిన తీరు అభినందనీయం. విమర్శలని అభినందనలు అనుకున్నారు. దారంతా ముళ్ళు, రాళ్లు దాటుకుంటూ వచ్చారు. తనలో ఉన్న నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీకి కాబోయే అధినేతగా.. పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు. తాను నిర్వర్తిస్తున్న విద్యా శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఆపై విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
* ప్రధాని మెచ్చిన నేతగా..
సాధారణంగా వారసత్వ రాజకీయాలకు బిజెపి( Bhartiya Janata Party) దూరం. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కానీ ఇప్పుడు అదే ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు పొందారు నారా లోకేష్. యోగాంధ్ర వేడుకలను విజయవంతంగా పూర్తి చేసి ప్రధాని మోదీ అభినందనలు అందుకున్నారు లోకేష్. ప్రత్యేకంగా ఢిల్లీ ఆహ్వానించి మరి అభినందనలు తెలిపారు మోదీ. అప్పటినుంచి నారా లోకేష్ పై మోడీకి గురి ఉంది. నిండు మనసుతో ఆశీర్వదించారు కూడా.
* సర్వత్రా అభినందనలు..
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అభినందనలు అందుకుంటున్నారు. ఆయన చేపట్టిన సంస్కరణలకు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ఇండియన్ ఇండస్ట్రీ అంతా ఆయనను హీరోగా చూస్తోంది. దానికి ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీనే సాక్ష్యం. బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ యువత లోకేష్ కు పట్టం కట్టారు. ఏపీలో రాజకీయాలను రాజకీయంగానే డీల్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటూ తప్పు చేసిన వాళ్లంతా వనికి పోతున్నారు.
* కేవలం వారసుడి గానే
కొన్నేళ్ల కిందట నారా లోకేష్ ను వారసుడిగా మాత్రమే చూసే వారం. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర చాటుకున్నారు. సమర్థవంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతోపాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారు. ఆయన చూపుతున్న చొరవా ప్రశంసలు అందుకుంటుంది.
* జాతీయస్థాయిలో సైతం…
లోకేష్ పనితీరు కేవలం రాష్ట్రస్థాయిలోనే కాదు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందుతోంది. యోగాంధ్ర లాంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని ఆకర్షించగలిగారు. యువ నాయకత్వంలో లోకేష్ చూపిస్తున్న పరిణితి, డెడికేషన్ పై ప్రధానికి ఎంతో నమ్మకం ఏర్పడడం విశేషం. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. ఏపీ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే సింహభాగం. 100% పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడం వెనుక లోకేష్ కృషి ఉంది. అందుకే అంతా ఇండస్ట్రియల్ హీరోగా చూస్తున్నారు. తాజాగా ప్రముఖ ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీ పై ఆయన ఫోటో వచ్చింది. తద్వారా లోకేష్ పరిధి ప్రభావం పెరుగుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ రాష్ట్ర నాయకుడే కాదు ఇప్పుడు జాతీయ నాయకుడిగా కూడా అవతరించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.



