వృద్ధులతో కలిసి ఉగాది జరుపుకున్న జన చైతన్య వేదిక
గుంటూరులోని ఇందిర ప్రియదర్శని కాలనీలో ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న నిరుపేద వృద్ధుల డే కేర్ హోమ్ ను జన చైతన్య వేదిక బృందం సందర్శించి ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ సమాజంలో ఆదరణ కోల్పోయిన వృద్ధులకు ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ అండగా ఉండటం హర్షణీయమన్నారు. వృద్ధులు మన సమాజానికి మూల స్తంభాలు అని నేటి యాంత్రిక జీవనంలో వారిని ఒంటరిని చేయడం బాధాకరమన్నారు. వృద్ధులకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ప్రేమ, పలకరింపులు మరియు ఆప్యాయతను అందించాలన్నారు. ఉగాది వేడుకలను వృద్ధుల మద్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు పెరుమాళ్ళ గౌరీ శిరీష ప్రసంగిస్తూ గత 2 నెలలుగా 50 మంది వృద్ధులు, వికలాంగులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని వారికి కావలసిన కుర్చీలు, టేబుల్స్, ప్లేట్స్ జన చైతన్య వేదిక అందించి తోడ్పడటం అభినందనీయమన్నారు. రుద్ర అకాడమి ఆఫ్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు శివరామకృష్ణ వర్మ, గాయత్రి ప్రశాంతి పీఠం ప్రతినిధి స్వాములు తదితరులు ఉగాది పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు.



