BHARATTODAY: వస్తువుల అమ్మకం అని పైకి నమ్మిస్తూ, లోపల మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా అమాయకులను నిలువునా ముంచుతున్న ‘క్యూ నెట్’ ఉచ్చులో ఎవరూ చిక్కుకోవద్దు … అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ కోరారు. క్యూ నెట్ మోసాలపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఇది పక్కాగా మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ పేరుతో సాగుతున్న భారీ మోసం.
హరికృష్ణ ఆత్మహత్య వెనుక చీకటి నిజాలు
గత ఏడాది అక్టోబర్లో సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాద ఘటన ఈ స్కామ్ ఎంతటి తీవ్రమైనదో తెలియజేస్తోంది. ఈ స్కీమ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరం. ఈ ముఠాలు ముఖ్యంగా ఐటీ కారిడార్లోని ఉద్యోగులను, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని భారీ ఆదాయం, ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయని ఆశచూపుతున్నాయి.
హెచ్చరిక: ‘క్యూ నెట్’ మాయలో పడకండి
ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో ఎంతో మంది ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ మోసం బారిన పడి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఇటువంటి మోసపూరిత సంస్థల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తక్కువ కాలంలో కోట్లు సంపాదించవచ్చనే ఆశతో జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు.



