జగన్( Y S Jagan Mohan Reddy ) సతీమణి భారతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? భర్త వెన్నంటి నడుస్తారా? ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ లభించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఓ ఆరు నెలల పాటు ఈ జిల్లాల పర్యటన కొనసాగనుంది. అది జరిగిన వెంటనే పార్టీలో సమూల ప్రక్షాళనలు తీసుకురానున్నారు. ఎక్కడెక్కడ అయితే నాయకత్వం బలహీనంగా ఉందో.. అటువంటి చోట చేర్పులు మార్పులు చేయనున్నారు. కొత్త ఇన్చార్జ్ లను ప్రకటించనున్నారు. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పాదయాత్ర షెడ్యూల్ వెల్లడించనున్నారు. ఆ సమయంలోనే తన భార్య భారతి రెడ్డికి కీలక పోస్టు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. తల్లి విజయమ్మ( vijayamma) ఇప్పటికే దూరమయ్యారు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం కుటుంబ పరంగానే కుమారుడ్ని కలుస్తున్నారు. అటు చెల్లెలు షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయ శత్రువు గానే చూస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా అడ్డగోలుగా చీలిపోయింది. మునుపటి మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబం ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం లేదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తన భార్య భారతి రెడ్డికి పార్టీలో కీలక పోస్ట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టం..
ప్రాంతీయ పార్టీలు( Regional parties ) మనుగడ సాధించాలంటే అధినేతలకు కుటుంబ సభ్యుల అండ అవసరం. ఏపీలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యుల అండ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కొనసాగుతున్నారు. తొలుత ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. తరువాత లోకేష్ తెరపైకి వచ్చారు. పార్టీని ఇప్పుడు ఆయనే టేక్ ఓవర్ చేశారు. పార్టీ మొత్తం గ్రిప్ లోకేష్ చేతిలో ఉంది. మరోవైపు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు అవసరమైన ప్రతిసారి చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సేవలందిస్తూనే ఉన్నారు. ఇక జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు అండగా సోదరుడు నాగబాబు ఉన్నారు. అవసరమైన ప్రతిసారి మెగా ఫ్యామిలీ అండగా నిలబడుతోంది.
* ఎవరి అండ లేకపోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రారంభంలో విజయమ్మతో పాటు షర్మిల( Y S Sharmila ) అండగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ దూరమయ్యారు. అందుకే సరైన కుటుంబ సభ్యుల అవసరం ఇప్పుడు జగన్కు ఎదురైంది. అందుకే భారతి రెడ్డిని పొలిటికల్ గా యాక్టివ్ చేస్తారని తెలుస్తోంది. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. వచ్చే ఏడాది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ సమయంలో పార్టీ సమన్వయం ఆయనకు అవసరం. అందుకే భారతి రెడ్డిని పార్టీలో క్రియాశీలకం చేసి.. కీలక పదవి కట్టబెడతారని తెలుస్తోంది.



