విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పెడతారా? ఆ ఆలోచనతో ఉన్నారా? అందుకే ఉత్తరాంధ్రలో కీలక ప్రకటన చేశారా? సామాజిక వర్గ సమావేశానికి వెళ్లి ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు విజయసాయిరెడ్డి. గతంలో ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా పనిచేయడంతో అక్కడ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భారీగా విరాళం కూడా ఇచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇచ్చారు. అవసరం అనుకుంటే కొత్త పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. అప్పటినుంచి ఊహాగానాలు మొదలయ్యాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయనకు. మొదట ఆ కుటుంబానికి ఆడిటర్ గా పనిచేసేవారు. అలా జగన్ మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. జగన్ ఏర్పాటు చేసిన కంపెనీలతోపాటు ఇతర కార్యకలాపాలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడిగా మారిపోయారు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు.
జగన్ నమ్మకం కోల్పోయి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. పార్టీ ఏర్పాటుతోపాటు అధికారంలోకి తీసుకురావడం వరకు అడుగడుగునా విజయసాయిరెడ్డి పాత్ర, కృషి ఉంది. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి మనసు మారింది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ తో విసిగి వేసారి పోయిన ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇకనుంచి రాజకీయాలు చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అలా చెప్పిన విజయసాయిరెడ్డి మనసంతా రాజకీయాలపైనే ఉంది.
అయితే విజయసాయిరెడ్డి విషయంలో కూటమి తీరు కూడా మారినట్లు స్పష్టం అవుతుంది. మద్యం కుంభకోణం కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. కానీ ఆయన అరెస్టు మాత్రం జరగలేదు. మద్యం కుంభకోణం పై విజయసాయిరెడ్డి నోరు తెరిచిన తర్వాత అరెస్టులు జరిగాయి. అంటే విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కూడా ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.
పవన్ కళ్యాణ్ పట్ల సాఫ్ట్ కార్నర్
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. 20 సంవత్సరాలుగా తనకు పవన్ కళ్యాణ్ తో స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ రావాలని కూడా ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్రంలో మతమార్పిడులు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్ష ఆరోపణలు చేశారు. హిందూ మతతత్వ వాదాన్ని అందుకోవడంతో ఆయన బిజెపిలో చేరుతారని అంతా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన సొంత పార్టీ పెడతారని ప్రచారం నడుస్తోంది. రాష్ట్రీయ హిందూ సేన లేదా సనాతన సేవ పేరిట పార్టీ ఏర్పాటు చేస్తారని మాత్రం టాక్ మొదలైంది. మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.



