తిరుపతి: వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ అసిస్టెంట్ తాతిరెడ్డి దామోదర్ రెడ్డి తెలియజేశారు. సోమవారం తిరుపతి సిమ్స్ హాస్పిటల్ ఓ.పి. నందు రోగులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండడం ద్వారా దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వారంలో ఒకరోజు” డ్రై డే ఫ్రైడే”కార్యక్రమాన్ని నిర్వహించాలని వారికి అవగాహన కల్పించారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాంతంలో విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్ష చేసుకోవాలని సూచించారు.



