తెలంగాణలో ( Telangana) బిజెపితో జనసేన పొత్తు పెట్టుకోనుందా? వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి వెళ్ళనున్నాయా? 2028 ఎన్నికలను జనసేన టార్గెట్ చేసుకుందా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఇటీవల తెలంగాణలో జనసేన పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. వారికి దిశ నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తద్వారా బిజెపితో పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.
ఏపీలో కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కృషి ఉంది. ఆయన చొరవ తీసుకోవడం వల్లే బిజెపి, టిడిపి దగ్గరయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య సమన్వయానికి పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఆ రెండు పార్టీలను ఏకం చేశారు. మూడు పార్టీలు కలిసి అద్భుత విజయం దక్కించుకున్నాయి. అయితే అదే ఫార్ములా తెలంగాణలో సైతం అనుసరిస్తారని తెలుస్తోంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీని కలుపుకెళ్తారా? లేకుంటే బిజెపి, జనసేన మాత్రమే కలిసి వెళ్తాయా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు చూస్తుంటే కేవలం బిజెపి,, జనసేన మాత్రమే కలిసి వెళ్తాయని స్పష్టమవుతుంది.
* కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు..
పవన్ కళ్యాణ్ కు తెలంగాణలోని కొండగట్టు( Kondagattu) ఆలయం ప్రత్యేక సెంటిమెంట్. వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా వస్తోంది. గతంలో వారాహి వాహన పూజ కూడా కొండగట్టు లోనే చేశారు పవన్ కళ్యాణ్. ఇక్కడ పూజ చేసిన అనంతరం వారాహి వాహనం ఏపీకి చేరుకుంది. అదే వాహనంపై ఎన్నికల ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. అక్కడ సూపర్ సక్సెస్ అయింది పొద్దు. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అందుకే కొండగట్టు ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 35 కోట్లు విడుదల చేయించారు పవన్ కళ్యాణ్. తద్వారా తెలంగాణ ప్రజలను కూడా ఆకర్షించ గలిగారు. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే ఎలాంటి పని అయినా చేయగలరు అని తెలంగాణ సమాజం గుర్తించేలా వ్యవహరించారు.
* సనాతన ధర్మం పేరిట..
గత కొద్ది రోజులుగా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణకు గట్టిగానే పోరాడుతున్నారు. అయితే ఇది బిజెపి( Bhartiya Janata Party) లైన్ కు దగ్గరగా ఉంది. పైగా బీజేపీ భావజాలానికి జనసేన మరింత దగ్గర అయింది. అందుకే తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. 2023 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంది జనసేన. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జనసేన నేరుగా బిజెపికి మద్దతు ఇచ్చింది. దీంతో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు బిజెపి కైవసం చేసుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో బిజెపి కొంత ప్రభావం చూపింది. జనసేన సైతం వార్డు స్థానాలతో పాటు కొన్ని పంచాయితీల్లో విజయం సాధించింది. ఉప సర్పంచ్ పదవులు కూడా పొందింది. అందుకే బిజెపి ఆలోచన మారినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, గ్రామీణ స్థాయిలో ఆ పార్టీకి ఉన్న ఓట్లు క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఆ పార్టీకి పరిమిత సంఖ్యలో సీట్లు ఇచ్చి.. నగరాలతో పాటు పట్టణాల్లో ఉన్న పవన్ అభిమానులను, మెగా ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. పవన్ కళ్యాణ్ తో పార్టీని బలోపేతం చేయించి.. ఎన్నికల ముంగిట పొత్తు ప్రకటన చేస్తారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?



