వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేయాలని భావిస్తోంది. కలిసొచ్చిన పార్టీలతో ఉద్యమించాలని చూస్తోంది. కానీ ఏపీలో ఆ పార్టీతో అడుగులు వేసి రాజకీయ పార్టీలు కనిపించడం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీని పట్టించుకోలేదు. ఆపై సింహం సింగిల్ గా వస్తుంది. ఒకరితో నాకు పొత్తులు అక్కర్లేదు అంటూ ప్రకటనలు చేసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం మరో పార్టీతో కలిసేందుకు ఇష్టపడేవి కావు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇతర రాజకీయ పార్టీల అవసరం ఏర్పడింది. అయితే కలిసి నడిచేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు. దీంతో చిన్నాచితకా పార్టీలను కలుపు కెళ్ళి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని భావిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ప్రజా ఉద్యమాలకు ప్లాన్..
అయితే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కాదు.. ఇకనుంచి ప్రతి ప్రభుత్వ వైఫల్యం పై పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఇటువంటి పోరాటాలకు తోటి రాజకీయ పార్టీలు అవసరం. ప్రధానంగా వామపక్షాల అవసరం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. కానీ వామపక్షాలు వైసిపి తో నడిచేందుకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి పట్ల సానుకూలంగా ఉంది. ఆపై ఇండియా కూటమికి దూరంగా ఉంది.
* బెడిసి కొట్టిన ప్రయత్నాలు..
ప్రస్తుతం వామపక్షాల కోసం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఉన్నారు. ఆయన ద్వారా వర్కౌట్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లు సమాచారం. ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను దూరం పెట్టి రాజకీయాలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వామపక్షాల నేతలను అణచివేశారు. ప్రజా సంఘాలను అస్సలు పట్టించుకోలేదు. వారి వినతులను సైతం స్వీకరించలేదు. అందుకే జగన్ అంటేనే వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు దూరం గా ఉంటున్నారు. విచిత్రం ఏమిటంటే బీజేపీతో టిడిపి భాగస్వామి. కానీ టిడిపి కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే శత్రుభావంతో చూస్తున్నాయి వామపక్షాలు. అందుకే ఎంత మాత్రం జగన్ శ్రేయస్కరం కాదని భావిస్తున్నాయి. స్వతంత్రంగానే అవి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని చూస్తున్నాయి. ఈ పరిణామం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమే. అందుకే ఆ పార్టీ చిన్నాచితకా పార్టీలతో ఉద్యమాలకు ప్రణాళిక వేస్తోంది.



