CM CHANDRABABU: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలో జరిగిన చోరీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాల్లో ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కదిరి గ్రూప్ టెంపుల్స్ బాధ్యతలను తాత్కాలికంగా హిందూపురం దేవాదాయ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కదిరి రూరల్ మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న మురళీకృష్ణ, అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి, చీరలు ఇతర విలువైన వస్తువులను కుటుంబ సభ్యులతో ఆలయం నుంచి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అమ్మవారి వస్తువులు ఎక్కడకి తీసుకుపోతున్నావని ఈవోను నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు కానుకలు, చీరలతో పాటు ఈవోను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. అమ్మవారి ఆభరణాలను తస్కరించేందుకు ప్రయత్నించిన ఈవోపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



